కలం, నల్లగొండ బ్యూరో : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Suryapet Bus Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగే సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను రెస్క్యూ చేసి బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వాహనాలను పునరుద్ధరించారు.

