కలం, నిర్మల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో మంగళవారం ప్రత్యేక వనమహోత్సవ (Special Vanamahotsavam) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Janaki Sharmila) పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం 16.03 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ.. ప్రజలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సుఖదేవ్ బొబాడే, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రీకాంత్తో పాటు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

