కలం, పెద్దపెల్లి: సింగరేణి (Singareni) కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఇచ్చిన సమ్మె నోటీసుపై ఈ నెల 21న హైదరాబాద్ లోని కేంద్ర అసిస్టెంట్ లేబర్ కమీషనర్ డా. శాస్వతి రాత్ ముందు రాజీ చర్చలు జరిగాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్చలకు యూనియన్ తరపున అధ్యక్షులు వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కె. సారయ్య, కె. వీరభద్రయ్య, ఎం. సమయ్య, ఎం. ఎల్లగౌడ్ మరియు కేంద్ర కార్యదర్శి వై. రామ్ గోపాల్, యాజమాన్యం తరపున డిప్యూటీ జీఎం (పర్సనల్) బి. రాజ గోపాల్ హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్చల్లో సమ్మెను నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని యాజమాన్యం తెలిపిందని పేర్కొన్నారు. అయితే అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారిని తదుపరి విచారణకు హాజరుపరచాలని సింగరేణి (Singareni) యాజమాన్యాన్ని లేబర్ కమీషనర్ ఆదేశించారని ఆయన తెలిపారు. రాజీ ప్రక్రియ పెండింగ్ లో ఉన్నందున సమ్మె చర్యకు దిగవద్దని, పారిశ్రామిక శాంతిని కాపాడాలని యూనియన్ కు సూచించారని తెలిపారు. తదుపరి తుది చర్చలు ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు రీజియన్ హెడ్ ముందు జరుగుతాయని పేర్కొన్నారు.
అప్పటికీ పరిష్కారం కాకపోతే రాజీ నివేదిక (ఆర్.ఓ.సి) జారీ చేస్తామని లేబర్ కమీషనర్ తెలిపారని ఆయన వివరించారు. కొన్ని కార్మిక సంఘాలు విషయం తెలిసి ఏఐటీయూసీ పై విమర్శలు చేయడం సరైంది కాదని, సమ్మె నోటీసు లో పేర్కొన్న డిమాండ్ లపై అగ్రిమెంట్ జరుగకుంటె అన్ని కార్మిక సంఘాల కు చర్చలు వివరాలు వివరించి సమ్మె కు పిలుపునిస్తామని తెలిపారు. కావున కార్మిక సోదరులు ఆందోళన చెందాల్సిన పని లేదని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఏఐటియుసి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

