కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెలుగులోకి రాని నీజ జీవిత స్ఫూర్తి కథలను గుర్తించి వాటిని సినిమా, మీడియా ,సృజనాత్మక రంగాలతో అనుసంధానించే లక్ష్యంతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, పాలమూరు బిడ్డ పీజీ విందా (PG Vinda) గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సహకారంతో ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్ చాలెంజ్’ (Frames of Founders Challenge)పేరుతో మహబూబ్ నగర్లో ఈనెల 25న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినికా క్రియేటర్స్ కౌన్సిల్ డైరెక్టర్ పంజా శ్రవణ్ అతిథిగా హాజరు కానున్నారు. విద్యార్థులు, యువ సృజనాకారులు, ఔత్సాహిక దర్శకులు, కంటెంట్ క్రియేటర్లు, పారిశ్రామిక వేత్తలు, కథకులతో ఆయన తన సినీ ప్రయాణం సృజనాత్మక అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే నిజ జీవిత కథలను సినిమాటిక్ కథలుగా ఎలా మలచవచ్చు అనే విషయాలను వివరించనున్నారు.
గ్రహణం, అష్టా చమ్మ, జెంటిల్మెన్, సమ్మోహనం, వి, లోఫర్, సారంగపాణి జాతకం, తదితరు చిత్రాలకు పీజీ విందా ఛాయా గ్రహణం అందించారు. ది లోటస్ పాండ్ చిత్రానికి రచయిత, దర్శకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పీజీ విందా సినిమాటిక్ ఎక్స్పో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, సినికా క్రియేటర్స్ కౌన్సిల్ వ్యవస్థాపక డైరెక్టర్, తెలుగు సినిమా ఆటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వ్యక్తులు, సంస్కృతి, పోరాటాలు, విజయాల్లో దాగి ఉన్న కథలను గుర్తించి విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు. ఎంపికైన నిజ జీవిత కథలను డాక్యుమెంటరీలు, డిజిటల్ కంటెంట్ , లేదా భవిష్యత్తులో తెలుగు ఫీచర్ ఫిల్ముగా అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 25వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలోని జిల్లా సామాఖ్య భవనంలో జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 87909 77669 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

