కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల నల్లగొండ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థులే హంతకులుగా పోలీసులు తేల్చడం సమాజాన్ని షాక్కు గురిచేసింది. ఈ ఘటన మరువకముందే మల్లారెడ్డి వర్సిటీలో ‘టాక్సిక్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం వివాదానికి దారితీసింది. కార్యక్రమంలో సౌండ్ బాక్స్ కిందపడటంతో ఇద్దరు విద్యార్థులు గాయపడగా, విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించడం, పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థల్లో (Education Crisis) సినిమా ట్రైలర్ విడుదల వంటి కార్యక్రమాలు నిర్వహించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలోని కాకినాడలో ఓ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులు గొడవపడటం కూడా సంచలనం రేపింది. చిన్నపాటి వివాదం కాస్తా ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యా వాతావరణంలో క్రమశిక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల భద్రత, కళాశాలల్లో నిర్వహించే కార్యక్రమాల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారాణాలు అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
అలాగే పలు కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి లభ్యమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. చదువుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన యువత హింస, అసభ్య ప్రవర్తన, మాదకద్రవ్యాల వైపు మళ్లడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యతపై అనేక విమర్శలొస్తున్నాయి. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ, క్రమశిక్షణ, కౌన్సెలింగ్, భద్రతా చర్యలను పటిష్టం చేసి, విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యావంతులు కోరుతున్నారు. విద్యార్థి భవిష్యత్తుపై గురువు బాధ్యత ఎంతమేరకు ఉంటుందో, తల్లిదండ్రుల పాత్ర అంతకుమించి ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

