కలం, స్పోర్ట్స్: సినెసిన్నాటి ఓపెన్లో వరల్డ్ నంబర్ 3 అలెక్సాండర్ జ్వెరెవ్ (Alexander Zverev)కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్లేయర్ టామీ పాల్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా, కోర్టులోనే అంపైర్తో గొడవపడి వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్లో జ్వెరెవ్ మొదట మంచి ఫామ్లో కనిపించాడు. తొలి సెట్ను 6-4 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్లో 4-3తో ఉన్నప్పుడు వర్షం వల్ల మ్యాచ్ కాసేపు ఆగింది. ఆట మళ్లీ ప్రారంభమయ్యాక టామీ పాల్ పుంజుకున్నాడు. మ్యాచ్ పాయింట్ను కాపాడుకుని, టై బ్రేకర్ ద్వారా రెండో సెట్ను 7-6 (6)తో దక్కించుకున్నాడు.
ఆ తర్వాత మూడో సెట్లో జ్వెరెవ్ 4-2 ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ చివరిలో తడబడ్డాడు. వరుసగా నాలుగు గేమ్లు గెలిచి టామీ పాల్ 6-4తో ఘన విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మూడో సెట్ జరుగుతున్న సమయంలో అంపైర్ ‘ఫుట్ ఫాల్ట్’ ఇవ్వడం వివాదానికి దారితీసింది. తన కెరీర్లో ఎప్పుడూ ఫుట్ ఫాల్ట్ చేయలేదని, అది అసాధ్యమని అంపైర్తో జ్వెరెవ్ వాదనకు దిగాడు. అయితే రీప్లేలో జ్వెరెవ్ తప్పు చేసినట్లు స్పష్టంగా తేలింది.
ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 14 ఏస్లు కొట్టినప్పటికీ, 9 డబుల్ ఫాల్ట్లు చేయడం అతని ఓటమిని శాసించింది. జ్వెరెవ్ ప్రవర్తనపై టెన్నిస్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడని మండిపడ్డారు. ఈ ఓటమిని పక్కనపెట్టి, జ్వెరెవ్ ఇప్పుడు తదుపరి యూఎస్ ఓపెన్ టోర్నీపై దృష్టి సారించాల్సి ఉంది.

