కలం, స్పోర్ట్స్: గాలే టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించడం కంటే టీమ్ భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టాలని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా (Deep Dasgupta) సూచించారు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు బలమైన పునాది నిర్మించుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఒక్కో సిరీస్ గెలుపు కంటే రాబోయే రెండు డబ్ల్యూటీసీ చక్రాల్లో ఆధిపత్యం సాధించే జట్టును తయారు చేయాలన్నారు. భారత్-శ్రీలంక టెస్టు సిరీస్ డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా కీలకంగా ఉంది. 2027 డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో ఉంది.
ఆటగాళ్లకు కొంత సమయం..
ఇప్పుడు జట్టులోకి వస్తున్న ఆటగాళ్లలో వైట్బాల్ క్రికెట్ అనుభవం ఎక్కువగా ఉందని దాస్ గుప్తా చెప్పారు. టెస్టు క్రికెట్కు అలవాటు పడేందుకు వారికి కొంత సమయం ఇవ్వాలని సూచించారు. అదే సమయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత జట్టు వెళ్తున్న దిశపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. టెస్టు సిరీస్లకు ముందు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించడం కూడా ఉపయోగకరమని దాస్గుప్తా సూచించారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఎక్కువ సమయం కలిసి పనిచేస్తే మెరుగైన సన్నద్ధత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
భారత్ తన 600వ టెస్టును దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాలేలో శ్రీలంకలో ఆడింది. ఇదే సమయంలో భారత టెస్టు జట్టులో పెద్ద మార్పులు వచ్చాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టులకు రిటైర్డ్ అయ్యారు. అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా కూడా జట్టుకు దూరమయ్యారు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. దీంతో గత దశాబ్దంలో జట్టుకు ప్రధాన బలంగా ఉన్న అనుభవజ్ఞుల తరం దాదాపుగా ముగిసింది.

