కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 150పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( TRS Chief Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ జీవోతో నీట్ అభ్యర్థులు, వారి పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. కేవలం నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణించేలా జీవో తీసుకురావడం తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే భవిష్యత్ తరాలకు న్యాయం చేయడం కోసమని కవిత గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో ఇతరులకు సీట్లు కేటాయించడం సరికాదని ఆమె అన్నారు. జీవో 150 కారణంగా మెడిసిన్లో సుమారు 1,600 సీట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు. స్థానికత ఆధారంగా సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని అన్నారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కనీసం ఏడేళ్ల పాటు తెలంగాణలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవిష్యత్ తరాలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం వెంటనే జీవో 150పై పునరాలోచించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

