కలం, కరీంనగర్: రాజకీయాల్లో నాయకులు వేర్వేరు పార్టీలైనప్పటికీ.. తెరవెనుక వారి మధ్య ఉండే సఖ్యత, ఆత్మీయత ఎప్పుడూ చర్చనీయాంశమే అవుతుంటాయి. కరీంనగర్ గడ్డపై (Karimnagar Leader) తాజాగా జరిగిన ఓ ఘటనే దీనికి అద్దం పడుతోంది. నగరంలో వైశ్య భవన్ పునర్నిర్మాణ భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకునే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఒకే వేదికపై, అదీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కల్సిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar), కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar), స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్, పలువురు కార్పొరేటర్లు ఒకే దగ్గర పక్కపక్కనే కూర్చుని ఎంతో ఉల్లాసంగా, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం ప్రజల ముందు గొడవ పడే ఈ అగ్రనేతలు, వ్యక్తిగత, సామాజిక కార్యక్రమాల్లో మాత్రం ఇలా కలియతిరగడం, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం చూస్తుంటే.. “వీరు పైకి పోరాడుతున్నా, లోలోపల ఒకటే” అనే చర్చ సామాన్య ప్రజల్లో, కార్యకర్తల్లో గట్టిగా నడుస్తోంది.

