కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లో ఉన్న ప్రతిష్టాత్మక వైశ్య భవన్ (Karimnagar Vaishya Bhavan)ను అత్యాధునిక హంగులతో నూతన కన్వెన్షన్ హాల్గా పునర్నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చేపట్టిన భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar), మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
గాంధీ రోడ్లోని వైశ్య భవన్ ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లకు వైశ్యసేవ కేంద్రం నిర్వాహకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి అంకురార్పణ చేస్తూ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నూతన కన్వెన్షన్ హాల్కు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు.
పూర్తి సహకారం అందిస్తాం.. గంగుల
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకే కాకుండా ప్రజలందరికి వేదికగా నిలిచే ఈ భవనాన్ని మరింత ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్ హాల్గా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ భవన నిర్మాణ పనులకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వైశ్యసేవ కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్, కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి రమేష్తో పాటు పలువురు ప్రముఖ ఆర్యవైశ్యులు, సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

