కలం, వెబ్ డెస్క్ : ఫేక్ వాట్సాప్ డీపీ, పేరు సృష్టించి ఓ వ్యక్తి ఏకంగా కోటీ రూపాయలను స్వాహా (WhatsApp Scam) చేశాడు. వాట్సాప్లో యజమాని పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి మోసానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన దీపక్ కుమార్ (37) ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ రమేష్ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.
ఒక చీరల రిటైల్ సంస్థలో పనిచేస్తున్న అకౌంటెంట్కు సంస్థ యజమాని పేరుతో రూపొందించిన ఫేక్ వాట్సాప్ నుంచి డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. నిజంగా యజమాని మెసేజ్ చేశాడని నమ్మిన అకౌంటెంట్ సంస్థ అకౌంట్ నుంచి రూ. కోటిని ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు.
అనంతరం మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాడికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, నిధుల మళ్లింపు ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. దీంతో దీపక్ కుమార్ను లక్నోలో ఈనెల 8వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. ఘటన జరిగిన 10 రోజుల్లోనే మోసపోయిన మొత్తం రూ.1 కోటి నగదును బాధితుడికి పూర్తిగా అప్పగించినట్లు సీపీ తెలిపారు. అలాగే, ఈ కేసులో మిగిలిన నిందితులను గుర్తించడం కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
డబ్బులు పంపే ముందు ధృవీకరణ తప్పనిసరి..
అధిక మొత్తంలో డబ్బు బదిలీకి సంబంధించిన సమయంలో ఇతర మార్గాల ద్వారా వివరాలను ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. వాట్సాప్ సందేశాలు, ప్రొఫైల్ ఫొటోలు లేదా డిస్ప్లే నేమ్ను మాత్రమే ఆధారంగా చేసుకుని డబ్బులు పంపకూడదన్నారు. వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా వచ్చే స్పామ్ APK ఫైళ్లు లేదా అనుమానాస్పద అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయకూడదని హెచ్చరించారు. సైబర్ మోసాలకు (WhatsApp Scam) గురైనవెంటనే 1930 కి కాల్ చేయాలని సీపీ రమేష్ కోరారు.
Also Read : ప్రభాస్కు ట్రీట్మెంట్.. ఇన్స్టాలో ఆర్థోపెడిక్ సర్జన్ పోస్ట్!
Follow Us On: Sharechat

