కలం, మెదక్ బ్యూరో: పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి మానవహారంగా ఏర్పడ్డారు. పాలిటెక్నిక్ వ్యవస్థలో ప్రవేశపెట్టిన ‘శక్తి స్కీమ్'(SHAKTI Scheme)ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ కోర్సులను స్కిల్ యూనివర్సిటీలో కలపడం, శక్తి పథకాన్ని (SHAKTI Scheme) అమలు చేయడం వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఉన్నత విద్యా అవకాశాలు దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన నిర్వహించారు. అలాగే, సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట సమీపంలోని హోంనాపూర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా విద్యార్థులు ధర్నా నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కిల్ యూనివర్సిటీలో విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : అగ్గిపెట్టె రావు పాపాలన్నీ తెలుసు.. హరీశ్పై పొంగులేటి సెటైర్లు!
Follow Us On: Sharechat

