కలం, వెబ్డెస్క్: న్యూఢిల్లీలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభానికి వేళైంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)తో పోరుపై చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ 3 వాంగ్ జీ యీ (Wang Zhiyi) స్పందించారు. గతంలో సింధుతో ఆడినప్పుడు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్పష్టమైన మైండ్ సెట్తో బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. సింధు ఇటీవల జపాన్ ఓపెన్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. ఆమె ఆటతీరు నాటికంటే నేడు చాలా మెరుగైందని వాంగ్ కొనియాడారు.
దీంతో సింధుతో పోటీ కఠినంగానే ఉంటుందని అంచనా వేశారు. అయితే, టోర్నీలో ముందు చూపే కాకుండా తన మొదటి మ్యాచ్పైనే పూర్తి దృష్టి పెడతానని చెప్పారు. అమెరికాకు చెందిన బెయివెన్ జాంగుతో వాంగ్ తన తొలి పోరులో తలపడనున్నారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు టైటిల్ గెలవలేకపోయినా.. దానిని ఒక భారంగా భావించడం లేదని ఆమె అన్నారు. ఫలితం కంటే ఆడే విధానంపైనే తనకు నమ్మకం ఉందన్నారు.
అలాగే, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్ పై గెలిచాక.. తన గేమ్లో కొన్ని వ్యూహాత్మక మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. కోర్టులో ప్రాక్టీస్ పూర్తి చేసిన వాంగ్.. ఇందిరా గాంధీ స్టేడియం పరిస్థితులపై మాట్లాడారు. స్టేడియంలో గాలి ప్రభావం కొంత ఎక్కువగా ఉందని, ఈ డ్రిఫ్ట్కు వీలైనంత త్వరగా అలవాటు పడాల్సి ఉందన్నారు. భూతకాలాన్ని మరిచిపోయి, రాబోయే ప్రదర్శనపైనే దృష్టి పెడతానని వాంగ్ ముగించారు.

