కలం, నిర్మల్: జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన యువకులు (Nirmal Youth) ఇజ్రాయిల్లో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టాంటాం ఓవర్సీస్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ద్వారా ఉపాధి కోసం ఇటీవల వారు ఇజ్రాయిల్ కు వెళ్లారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హెర్మోన్ (ఇరుమోను) సీయోను మంచు కొండలపై భారత జాతీయ జెండాను ప్రదర్శించి వేడుకలు నిర్వహించారు.
విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ మాతృదేశంపై తమకున్న ప్రేమ, దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన అశోక్, రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం స్వదేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేవారమని, ఈసారి ఇజ్రాయిల్ లో ఉండటంతో అక్కడే భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

