కలం, స్పోర్ట్స్: భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. 2026 ఆగస్టు 15న శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో బరిలోకి దిగడం ద్వారా ఆయన ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. తన తొలి 30 టెస్టు మ్యాచ్లను 30 వేర్వేరు వేదికల్లో ఆడిన మూడో భారత క్రికెటర్గా జైస్వాల్ రికార్డు సృష్టించారు. జైస్వాల్ 2023 జులైలో వెస్టిండీస్లోని రోసో మైదానంలో తొలి టెస్టు ఆడారు. నాటి నుంచి ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ ఒక కొత్త వేదికపైనే జరగడం విశేషం. గతంలో భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ తన తొలి 32 టెస్టులను, సంజయ్ మంజ్రేకర్ తొలి 33 టెస్టులను వేర్వేరు మైదానాల్లో ఆడారు.
ఇప్పుడు జైస్వాల్ కూడా వారి సరసన చేరారు. ఆయన తన కెరీర్లో కరేబియన్, దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంకలోని పలు ప్రముఖ వేదికల్లో మ్యాచ్లు ఆడారు. ప్రస్తుతం జరుగుతున్న గాలే టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 37 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేశారు. అయితే కేఎల్ రాహుల్తో రన్నింగ్లో సమన్వయ లోపం జరిగింది. అదే సమయంలో శ్రీలంక ఫీల్డర్ కేశర నువాంతను ఢీకొనడంతో జైస్వాల్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యారు.

