కలం, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) డిమాండ్ చేశారు. శనివారం బైంసా పట్టణంలో శ్రీకాంతాచారి (Srikantachari) జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి స్మారకంగా త్వరలో బైంసాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు.
విగ్రహ ఏర్పాటుకు పలుమార్లు అనుమతి కోరినప్పటికీ జిల్లా ఎస్పీ, కలెక్టర్ అనుమతులు ఇవ్వకపోవడం సరికాదన్నారు. అమరవీరుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. నిర్మల్ పట్టణంలో లో కాంగ్రెస్ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ, బైంసాలో శ్రీకాంతాచారి విగ్రహ ఏర్పాటుకు అనుమతి నిరాకరించడం వివక్షతతో కూడుకున్నదని విమర్శించారు. అనుమతులు లేకున్నా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

