కలం, తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా తుర్కపల్లి (Turkapally) మండలం ములకలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం భారీ చోరీ జరిగిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన లావణ్య కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం లావణ్య కుటుంబ సభ్యులు కూలి పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించారు.
లోపలికి వెళ్లేసరికి బీరువా తెరిచి, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన రూ. 2 లక్షల నగదుతో పాటు, సుమారు 4.30 తులాల బంగారం, 23 తులాల వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్సై శివకృష్ణ తెలిపారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నామని, చోరీకి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

