గోదావరి పుష్కరాలపై సమీక్ష.. మంత్రుల దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు – 2027 (Godavari Pushkaralu)” కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై చర్చించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

అటు గోదావరి పుష్కరాలు – 2027 టీజీఎస్ ఆర్టీసీ ప్రాథమిక కార్యాచరణ నివేదికపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా పాత 5 జిల్లాల్లోని 85 పుష్కర ఘాట్లు, వాటికి సమీపంలో ఉన్న 22 ఆర్టీసీ బస్ స్టేషన్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లలో భవనాలు, ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, రోడ్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. డిసాస్టర్ బోట్స్, రిస్క్ టీమ్స్, హైడ్రా లాంటి బృందాలు సమన్వయం చేసుకునేల ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

ఒక్కో బస్ స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.3 కోట్లు అవసరమని అంచనా వేసి 22 బస్ స్టేషన్లకు మొత్తం రూ.66 కోట్లు అవసరం ఉందని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికుల వేచి ఉండే ప్రాంతాలు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక్కో ప్రాంతానికి సుమారు రూ.1 కోటి చొప్పున, 22 ప్రాంతాలకు మొత్తం రూ.22 కోట్లు అవసరమని అంచనా వేశారు. శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

మొత్తం మౌలిక వసతుల వ్యయం..

బస్ స్టేషన్ల ఆధునీకరణ: రూ.66 కోట్లు
తాత్కాలిక బస్ షెల్టర్లు, ఇతర సౌకర్యాలు: రూ.22 కోట్లు
మొత్తం: రూ.88 కోట్లు

అదనపు బస్సుల ఏర్పాటు..

మహాలక్ష్మి పథకం అమల్లో ఉండటంతో ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంది. గోదావరి పుష్కరాల సమయంలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, గత పుష్కరాలతో పోలిస్తే సుమారు 30% అదనంగా బస్సులను నడపాలని ప్రతిపాదించడం జరిగింది. ఘాట్‌ల వారీగా ప్రయాణికుల డిమాండ్ బట్టి ఘాట్లు – ఆర్టీసీ బస్ స్టేషన్ల మధ్య కనెక్టివిటీ పెంచడం జరుగుతుంది.

జిల్లాల వారీగా ప్రయాణికుల రద్దీ..

అత్యధిక రద్దీ ఉండే రోజులు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. పార్కింగ్ ప్రాంతాలు, తాత్కాలిక బస్ షెల్టర్లు, ఘాట్ల మధ్య షటిల్ బస్సుల ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అన్ని గుర్తించిన ఘాట్లు, సంబంధిత ఆర్టీసీ బస్ స్టేషన్లు, దూరాలు, రోడ్డు మార్గాలు, కనెక్టివిటీ వివరాలతో సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రవాణా సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రజా రవాణా రాష్ట్రం నలుమూలల నుండి బస్సుల నడవడమే కాకుండా అంతరాష్ట్రల నుండి ఆంధ్రపదేశ్, మహారాష్ట్ర,కర్ణాటక ,తమిళనాడు , కేరళ నుండి వచ్చే భక్తులకు ప్రజా రవాణాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది.

టీజీఎస్ ఆర్టీసీ వివిధ రీజియన్ల పరిధిలోని పుష్కర ఘాట్లు, వాటికి కేటాయించిన బస్సు డిపోలు, ప్రణాళిక ప్రకారం బస్సులు, ట్రిప్పులు మరియు ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్..

కరీంనగర్ రీజియన్ పరిధిలో ప్రధాన ఘాట్లు: ధర్మపురి, ఎర్దండి, కాళేశ్వరం, వాల్గొండ.
డిపోలు: గోదావరిఖని, హుజురాబాద్, హుజురాబాద్, జగిత్యాల, కరీంనగర్ 1, కరీంనగర్ 2, కోరుట్ల, మంథని, సిరిసిల్ల, వేములవాడ
పుష్కరాల్లో భాగంగా ధర్మపురి, కాళేశ్వరంలకు అత్యధిక సంఖ్యలో బస్సులు మరియు ట్రిప్పులను ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరిగింది.

నిజామాబాద్..

నిజామాబాద్ రీజియన్ ప్రధాన ఘాట్లు: పోచంపాడ్, కందకుర్తి, తడపాకల, దొంచంద, గుమిర్యాల్, సావేల్, తుంగిని, ఉమ్మేడ, బాసర, తాడ్బిలోలి, కోస్లీ, బినోలా.
డిపోలు: ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ 1, బాన్స్ వాడ, బోధన్
కల్పించాల్సిన సౌకర్యాలు: పోచంపాడ్, కందకుర్తి, దొంచంద, తాడ్బిలోలి తదితర ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, బెంచీలు టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఆదిలాబాద్..

ఆదిలాబాద్ రీజియన్ ప్రధాన ఘాట్లు: బాసర, ముధోల్, నిర్మల్, ఖానాపూర్, మంచేరియల్, జెన్నారం, లక్సెట్టిపేట మొదలైనవి.
డిపోలు: భైంసా, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరానికి చెందిన సిటీ బస్సులు, నిర్మల్, మంచిర్యాల
విశేషం: బాసర పుణ్యక్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ నగర డిపోలతోపాటు బైంసా డిపోల నుండి అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు కేటాయించారు.

వరంగల్..

వరంగల్ రీజియన్ ప్రధాన ఘాట్లు: కాళేశ్వరం, రామన్నగూడెం, మంగపేట, ముళ్లకట్టు.
సంబంధిత డిపోలు: హనుమకొండ, నర్సంపేట, తొర్రుర్ , జనగామ, పరకాల, భూపాలపల్లి
ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు: కాళేశ్వరం ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ కోసం తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఖమ్మం..

ఖమ్మం రీజియన్ ప్రధాన ఘాట్లు: భద్రాచలం, పమాశాల, రామానుజవరం, చినరావిగూడెం, మోతేగడ్డ, దుమ్ముగూడెం, ఎదుళ్ల బయ్యారం, కొత్తగూడెం, చింతిర్యాల, నెల్లిపాక.
సంబంధిత డిపోలు: ఖమ్మం, మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మధిర భద్రాచలం
విశేషం: భద్రాచలం, పరిసర ప్రాంతాల ఘాట్లకు భక్తులు సులువుగా చేరుకునేలా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం డిపోల ద్వారా విస్తృత బస్సు సర్వీసులు సిద్ధం చేశారు.

తాగునీరు: నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోని కందకుర్తి, పోచంపాడ్, తాడ్బిలోలి వంటి ప్రధాన ఘాట్ల వద్ద ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం.

ప్రయాణికుల కోసం షెల్టర్లు: ఎండ, వర్షం నుండి భక్తులను కాపాడేందుకు టెంట్లు, విశ్రాంతి తీసుకోవడానికి బెంచీల ఏర్పాటు.

లైటింగ్ ఏర్పాట్లు: ఘాట్లు మరియు బస్ పాయింట్ల వద్ద రాత్రి సమయంలో రక్షణ కోసం వెలుగునిచ్చే హై-మాస్ట్ లైట్ల నిర్వహణ.

తాత్కాలిక బస్ టెర్మినల్స్: కాళేశ్వరం, ఇతర కిక్కిరిసిన ప్రదేశాల్లో బస్సులు నిలపడానికి, ప్రయాణికులు సులువుగా ఎక్కడానికి ప్రత్యేక తాత్కాలిక బస్ స్టేషన్ల ఏర్పాటు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>