కలం, జగిత్యాల: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం (Har Ghar Tiranga Rally) లో భాగంగా జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక టౌన్ హాల్ నుండి తహసీల్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి పాల్గొన్నారు.
జాతీయ జెండాను చేతబూని నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. భారతమాతకు జై, వందేమాతరం నినాదాలతో జగిత్యాల పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

