కలం, నిర్మల్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single-Use Plastic) వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రవిబాబు (Ravi Babu) హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పలు దుకాణాలపై గురువారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేశారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించవద్దని ఇప్పటికే పలుమార్లు వ్యాపారులకు సూచించినప్పటికీ కొందరు పట్టించుకోకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

