కలం, నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలోని(RGUKT Basar) సెంట్రల్ లైబ్రరీలో జాతీయ గ్రంథాలయ అధికారుల దినోత్సవాన్ని(Librarians Day) బుధవారం ఘనంగా నిర్వహించారు. భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసంలో పఠనాభిరుచికి, గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, జ్ఞాన పరిధి మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.
ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ. మురళీధర్షన్ మాట్లాడుతూ.. నిరంతర అభ్యసనం, పరిశోధనలకు గ్రంథాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో భాగంగా గ్రంథాలయాలను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం సెంట్రల్ లైబ్రరీకి పుస్తకాలను విరాళంగా అందించిన విద్యార్థులతో పాటు, నిత్యం గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

