కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లాలోని వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా, పాములు, విషపురుగులకు ఆవాసంగా మారకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) అధికారులను ఆదేశించారు.
మంగళవారం వసతి గృహాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై అన్ని సంక్షేమ శాఖల అధికారులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహాల పరిసరాలు, గదులు, వంటశాలలు, మరుగుదొడ్లు, ఇతర ప్రదేశాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
వసతి గృహాల పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, పొదలు, నిల్వ నీరు లేకుండా చూడాలని తెలిపారు. పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను ఎప్పటికప్పుడు తొలగించి, వ్యర్థాలను సక్రమంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పాములు, ఇతర విషపురుగులు దాగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పూర్తిగా శుభ్రం చేయాలని సూచించారు.
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పాముకాట్ల నివారణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. వసతి గృహాల భవనాల చుట్టూ పరిశుభ్రతను పాటించడంతో పాటు రాత్రి వేళల్లో తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి, తరచూ తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Also Read : అంజనగిరి పాఠశాలలో విద్యార్థులతో మమేకమైన నిరంజన్ రెడ్డి
Follow Us On: Instagram

