కలం, వెబ్డెస్క్: తన పిల్లలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే తాను రూ.40కోట్ల ఆఫర్ వదులుకున్నట్లు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) తెలిపారు. మంచి నటుడిగానే కాకుండా, ఆదర్శవంతమైన వ్యక్తిగానూ నిలవాలని కోరుకున్నట్లు చెప్పారు. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో సునీల్ శెట్టి.. అనేక ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు అహాన్, అతియా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ తన జీవితం, కుటుంబం గురించిన విషయాలు పంచుకున్నారు. ‘ నేను నమ్మిన విలువలు, నమ్మకాలు నా జీవితం, కెరీర్పై ప్రభావం చూపించాయి. నేను నా పిల్లలకు ఆదర్శంగా నిలవాలనుకున్నా.
అందుకే పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం రూ.40కోట్ల ఆఫర్ వస్తే తిరస్కరించా. నాకు డబ్బు అవసరం ఉండొచ్చు. కానీ, నాకు ఇష్టంలేని పనిని చేయను. ముఖ్యంగా నా పిల్లలు అహాన్, అతియాకు నా కారణంగా మచ్చ వచ్చేవేవీ నేను చేయను. అందుకే ఆ తర్వాత ఎవరూ ఇలాంటి ఆఫర్లతో నా దగ్గరికి రాలేదు.’ అని సునీల్ శెట్టి వెల్లడించారు.
తండ్రి వీరప్ప శెట్టి మరణం, కెరీర్లో గ్యాప్ గురించి సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ ‘ నా తండ్రి 2014 నుంచి అనారోగ్యంతో బాధపడేవాడు. ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాణ్ని. ఆ సమయంలో నా మానసిక స్థితి అంత బాగోలేదు. దాంతో సినిమాలు వదిలేశాను. అయితే, 2017లో నా తండ్రి చనిపోయిన రోజే నాకొక ఆఫర్ వచ్చింది. అదొక సూచనగా భావించి మళ్లీ నటన వైపు అడుగువేశాను. అయితే, గ్యాప్ తర్వాత నటించడం అంత సులువు కాదు. అన్నీ మారిపోతాయి. అందరూ కొత్తవాళ్లలా అనిపిస్తుంది. కానీ, దక్షిణాది సినిమాలతో నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా’ అని చెప్పారు.
కరోనా తర్వాత తన జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకున్నట్లు సునీల్ శెట్టి తెలిపారు. పుస్తకాలు చదవడం, వ్యాయామం, వేర్వేరు అంశాల్లో శిక్షణ వంటి వాటి ద్వారా తనను తాను మెరుగుపర్చుకున్నట్లు వెల్లడించారు. తాను సినిమాల్లో లేని సమయంలోనూ తనను గుర్తుపెట్టుకున్న అభిమానులకు, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Also: యాంకర్ సుమ కామెంట్లపై వివాదం..
Follow Us On: Youtube


