కలం, భద్రాచలం: పశ్చిమ బెంగాల్లోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా వ్యాప్తంగా మహిళా వైద్యులు గర్జించారు. స్త్రీలపై, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై జరుగుతున్న వరుస దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్ పిలుపు మేరకు ఆగస్టు 9 ‘అభయ దివస్’ పురస్కరించుకుని భద్రాచలం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి బస్ స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని, వైద్య రంగానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ జయభారతి, కోశాధికారి డాక్టర్ చెల్లాగుళ్ల స్పందన, తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.

