కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta ) పట్టణంలోని పాతగుట్ట సమీపంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుండ్లపల్లి నర్సింహకు చెందిన దుకాణంలో షార్ట్సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న వివిధ రకాల సామగ్రి మంటల్లో కాలిపోయిందని యజమాని గుండ్లపల్లి నర్సింహ తెలిపారు. సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అగ్నిమాపక సిబ్బంది నష్టం వివరాలను అంచనా వేశారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

