కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్లో అవినీతి పెరిపోయిందంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని 100 మంది ఎమ్మెల్యేలు తామే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం విజయవాడలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇసుక నుంచి ఎమ్మార్వో ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వరకు అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. గతంలో రూ.100 అడిగితే, ఇప్పుడు రూ.150 అడుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారులతోపాటు రాజకీయ అవినీతి కూడా పెరిగిపోయిందని దుయ్యబట్టారు. ఇక వైసీపీ పార్టీపై సీపీఐ నారాయన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ గొడ్డలి గొడ్డలి పార్టీ అని.. అందులోని వారంతా సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కోర్టులు మొట్టికాయలు వేసినా.. వైసీపీ నేతల తీరు మారడం లేదని దుయ్యబట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని వైసీపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పుకొచ్చారు.

