కలం, నిజామాబాద్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా (BJP OBC Morcha) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఇందూరు (Nizamabad) నగరానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు మాదాసు స్వామి యాదవ్ (Swamy Yadav) నియమితులయ్యారు. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఏబీవీపీలో క్రియాశీల నాయకుడిగా పనిచేసి దశాబ్దాల కాలంగా ఇందూరు బీజేపీలో నిబద్ధత గల కార్యకర్తగా సమాజంలో మంచి గుర్తింపును సాధించిన కార్యకర్త మాదాసు స్వామి యాదవ్ ను ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తున్నట్టు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ తెలిపారు.
నిబద్ధత గల కార్యకర్తగా పార్టీ అప్పగించిన ఏ పనినైనా సరే సమర్థవంతంగా నిర్వహించి గతంలో ఓబీసీ మోర్చా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో, బీసీలను ఏకతృతం చేసి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను స్వామి యాదవ్ ను అభినందిస్తూ భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో బీసీల కోసం పార్టీ, మోడీ నేతృతంలో తీసుకు వస్తున్న అనేక కార్యక్రమాలకు ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించి రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం సూచించిన ప్రతి పనిని తన కర్తవ్యంగా భావించి శక్తివంచన లేకుండా పనిచేస్తానని సిద్ధాంతం కోసమే తన జీవితం మొత్తం కృషి చేస్తానని అన్నారు. తన మీద నమ్మకంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

