కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఒకే ఆధార్ నెంబర్తో ఇద్దరు ఉద్యోగులకు జీతాలు చెల్లించిన ఘటనలు తెలంగాణ ప్రభుత్వ ఆడిట్ (Telangana Govt Audit) లో వెలుగుచూశాయి. మొదటి దశలో గుర్తించిన 40 కేసుల్లో మొత్తం 80 మంది ఉద్యోగులకు డబుల్ శాలరీలు విడుదలైనట్టు ప్రాథమిక పరిశీలనలో తేలింది. పోలీస్ (డీజీపీ), రెవెన్యూ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్, వ్యవసాయం, వైద్యారోగ్యంతో పాటు మరికొన్ని శాఖల్లో అక్రమ చెల్లింపులు అధికారులు జరిగినట్లు గుర్తించారు. ఒకే ఆధార్ నంబర్ లేదా గుర్తింపు వివరాలతో ఇద్దరు వేర్వేరు ఉద్యోగులకు వేతనాలు జమైనట్టు ఆడిట్ పరిశీలనలో తేలింది. ఈ కేసుల్లో కొందరు ఒకే శాఖలో పని చేస్తుండగా, మరికొందరు వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా నమోదై జీతాలు పొందినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ అంశంపై సంబంధిత శాఖల నుంచి వివరణలు కోరినట్లు సమాచారం.
పోలీస్ శాఖలో ఎక్కువ కేసులు
= ఈ లిస్టులో అత్యధికంగా పోలీస్ (డీజీపీ) శాఖకు చెందిన ఉద్యోగుల పేర్లే ఉన్నాయి. రెవెన్యూ, ప్రజారోగ్యం, పాఠశాల విద్య, పంచాయతీరాజ్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఉన్నత విద్య, డీఎంఈ తదితర శాఖల్లో కూడా ఇలాంటి కేసులు బయటపడ్డాయి.
= కొన్ని కేసుల్లో ఒక్కో ఉద్యోగి పేరుతో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు గ్రాస్ శాలరీలు, రూ.3 లక్షలకు పైగా నెట్ శాలరీలు విడుదలైనట్లు రికార్డుల్లో తేలింది. ఒకే ఉద్యోగి వివరాలతో మరో ఉద్యోగికి కూడా వేతనం విడుదల కావడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడినట్లు ఆడిట్లో తేలింది.
= ఈ కేసులు సాంకేతిక లోపమా? డేటా డూప్లికేషనా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన అక్రమ చెల్లింపులా? అనే కోణంలో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. బాధ్యులపై చర్యలతో పాటు, అదనంగా చెల్లించిన మొత్తాల రికవరీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అక్రమాలు గుర్తించిన శాఖలు
పోలీస్ (డీజీపీ), రెవెన్యూ, ప్రజారోగ్యం, పాఠశాల విద్య, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, వైద్యారోగ్యం, డీఎంఈ, ఉన్నత విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్.

