కలం, స్పోర్ట్స్ : ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్స్కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. యూరోపియన్ T20 ప్రిమియర్ లీగ్ (European T20 Premier League) తొలి సీజన్లో ఆయన ఆమ్స్టర్డ్యామ్ ఫ్లేమ్స్ జట్టుకు మార్కీ ప్లేయర్గా బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 26 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్లో రహానే తన అనుభవంతో జట్టుకు అండగా నిలవనున్నారు. భారత జట్టు తరఫున రహానే 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడారు. 2023 జులైలో వెస్టిండీస్పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆయన.. అనంతరం దేశవాళీ, ఐపీఎల్లోనూ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఐపీఎల్లో రహానే 212 మ్యాచ్లలో 5,367 పరుగులు సాధించారు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా నిలిచారు. 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. జులై 30న క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రహానేను ఆమ్స్టర్డ్యామ్ ఫ్లేమ్స్ ఫ్రాంచైజీకి ఆహ్వానిస్తూ స్టీవ్ వా, అభిషేక్ బచ్చన్, టిమ్ థామస్లు హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు రహానే తెలిపారు. అనుభవం, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం కలిగిన రహానే రాకతో తమ జట్టు స్థాయి మరింత పెరుగుతుందని ఆమ్స్టర్డ్యామ్ ఫ్లేమ్స్ యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేసింది. యూరోపియన్ క్రికెట్ వేదికపై రహానే ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తిగా మారింది.

