కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్లో జరుగుతున్న పేపర్ లీకేజీ నిరసనల్లో (Paper Leak Protests) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాంచీలోని అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేహా బోరాపై గుర్తు తెలియని వ్యక్తి ఇంక్ చల్లాడు. వెంటనే అతడిపై యువకులు దాడి చేయబోగా.. పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లే మార్గంలోని బిర్సా చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనిపై నేహా బోరా స్పందిస్తూ.. “నాపై ఇంక్ చల్లినంత మాత్రాన భయపడుతానని అనుకోవద్దు. ఢిల్లీ ఆందోళనల్లో నేను పెల్లెట్ గన్స్, లాఠీఛార్జిలనే ఎదుర్కొన్నా” అని స్పష్టం చేశారు. “మేం శాంతియుతంగానే నిరసన చేపట్టాం. జనాల మధ్యలో నుంచి ఓ వ్యక్తి వేగంగా వచ్చి నేహాపై ఇంక్ చల్లాడు. అతను బీజేపీ గూండా” అని శివానీ అనే విద్యార్థి సంఘం నాయకురాలు వివరించారు.
ఆమె దేశ వ్యతిరేకి..
నేహా బోరాపై ఇంక్ చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. “నేహా బోరా ఉమర్ ఖలీద్ను సపోర్ట్ చేస్తున్నారు. ఆమె అంటే నాకు అస్సలే నచ్చదు. దేశ వ్యతిరేకి. అందుకే ఇంక్ చల్లాను” అంటూ నినాదాలు చేశారు. సదరు వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. పారదర్శకత పాటించడం లేదంటూ విద్యార్థులు కొద్ది రోజులుగా నిరసనలు చేపట్టారు.
Also Read : మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటారా?.. విద్యార్థినుల ఆందోళన
Follow Us On: Instagram

