కలం, వెబ్ డెస్క్ : ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త ప్రాణాలు తీసేందుకు ఒక భార్య వేసిన స్కెచ్ కలకలం రేపింది. తన భార్య భవానీ, ఆమెకు సన్నిహితుడైన సైదులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ (Dornakal) మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో భవానీతో వివాహం జరగగా, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న తాను గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఖమ్మంలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్న సైదులతో భవానీకి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని ఆరోపించారు.
తాను ఇంట్లో లేని సమయంలో సైదులు ఇంటికి వచ్చేవాడని, తమ సంబంధానికి తాను అడ్డుగా ఉన్నానని భావించి తనను హత్య చేయాలని ప్రణాళిక రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాక్సిడెంట్ చేసి తనను చంపాలని వేరే వ్యక్తికి తన భార్య మెసేజ్ చేసిందని, దీనికి సంబంధించిన సెల్ఫోన్ సందేశాలు సహా కొన్ని ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

