కలం, వెబ్ డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాపై (Sandeep Sultania) హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల విషయంలో గతంలో జారీ చేసిన కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. వ్యక్తిగత హాజరుకు ఆదేశించినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అలాగే కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాది సుబ్రహ్మణ్యం యాదవ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన హైకోర్టు సందీప్ సుల్తానియాపై ఫారం-1 నోటీసు జారీ చేసింది.
అదే సమయంలో సందీప్ సుల్తానియాను అరెస్టు చేసి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టుకు తప్పకుండా హాజరవుతానని అండర్టేకింగ్ ఇస్తే, రూ.5 వేల వ్యక్తిగత బాండ్పై విడుదల చేయాలని కూడా స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమనే సంకేతాలను హైకోర్టు ఇచ్చింది.

