కలం, వరంగల్ : వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) క్యాంపు కార్యాలయం ఎదుట గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ బాధిత కుటుంబం పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు.
బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతోనే నిరసనగా ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని వారు తెలిపారు. తమ ఫిర్యాదుపై వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను బాధితులు కోరారు. ఘటనతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని బాధిత కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు.

