కలం, వెబ్ డెస్క్ : లంచం తీసుకుంటూ అధికారులు ఎంతమంది దొరికిపోతున్నా కొందరి తీరులో మార్పు రావడం లేదు. అనకాపల్లి జిల్లా మైన్స్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక సోదాలు తీవ్ర కలకలం రేపాయి. ఒక క్వారీకి సంబంధించి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు మైనింగ్ సర్వేయర్ (Anakapalli Mining Surveyor) మురళీకృష్ణ భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు. మొత్తం 15 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని బాధితుడిని వేధించాడు.
బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించారు. సర్వేయర్ మురళీకృష్ణ అడ్వాన్స్ రూపంలో 5 లక్షల రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
ఈ సర్వేయర్ మురళీకృష్ణకు లంచాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా రెండుసార్లు సస్పెండ్ అయినా తన అలవాటును మానలేదు. 2018లో విశాఖపట్నం మైన్స్ ఆఫీస్లో పనిచేస్తున్న సమయంలో 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అప్పట్లోనే కేసు ఎదుర్కొన్న ఈ అధికారి, మళ్లీ ఇప్పుడు అనకాపల్లిలో 5 లక్షల లంచంతో చిక్కడం గమనార్హం.

