కలం, వెబ్డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ నీట్ స్టూడెంట్ ఆత్మహత్య (NEET Student Suicide) చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన కంతేటి వైష్ణవి (19) మూడు వారాల క్రితం కృష్ణా జిల్లాలోని కానురూలో ఉన్న శ్రీ భారతి ఇన్స్టిట్యూట్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం చేరింది. ఇన్స్టిట్యూట్కు చెందిన హాస్టల్లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది. ఇటీవల వైష్ణవి ఇంటికి కూడా వెళ్లి వచ్చింది. తనకు ఇంటికి దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేదని, వచ్చి తనను తీసుకెళ్లాలని అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెప్పింది.
వైష్ణవి పేరెంట్స్ మాత్రం హాస్టల్ నుంచి తీసుకెళ్లలేదు. కోచింగ్ కంటిన్యూ చేయాలని, వైష్ణవికి నచ్చజెప్పి ఊరుకున్నారు. ఈ నెల 4న వైష్ణవి తనకు ఆరోగ్యం బాగాలేదని కోచింగ్కు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోచింగ్ ముగించుకొని రాత్రి 9 గంటలకు హాస్టల్కు వచ్చిన వైష్ణవి తోటి విద్యార్థులు గది లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు.
హాస్టల్ సిబ్బంది గది తలుపులు పగులగొట్టి చూడగా అప్పగికే వైష్ణవి మృతి చెందింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

