కలం, ఖమ్మం బ్యూరో: రామాయణ ఆధారిత పరిపాలనా సూత్రాలు, రాజ్య వ్యవస్థ దేవాలయాల సమర్థ నిర్వహణే ధ్యేయంగా భద్రాద్రి పుణ్యక్షేత్రం(Bhadrachalam Temple)లో మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం (వర్క్షాప్) బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SITA) ఆధ్వర్యంలో, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సౌజన్యంతో ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రామాయణంలో వివరించిన పరిపాలనా విధానాలు, రాజనీతితో పాటు దేవాలయాల నిర్వహణలో కార్యనిర్వాహక అధికారులు (ఈవోలు), అర్చకస్వాములు, సిబ్బంది యొక్క కార్యదక్షత ఎలా ఉండాలనే అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.మూడు రోజుల పాటు సాగే ఈ వర్క్షాప్లో ప్రతిరోజూ నాలుగు సెషన్ల చొప్పున మొత్తం 12 సెషన్లు ఉంటాయి. ఒక్కో సెషన్ సుమారు గంటన్నర పాటు కొనసాగుతుంది. దేవాలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాలు, ఆలయ మర్యాదలు, సంహితలు, అలాగే భక్తులు, ప్రజలు, ప్రజాసంఘాలతో సత్సంబంధాలు నెరపుతూ సమగ్రమైన పరిపాలనను ఎలా అందించాలనే దానిపై ప్రత్యేక బోధనలు చేస్తున్నారు.
ఈ శిక్షణ శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో ఈవోలు, అర్చకులు, అడ్మినిస్ట్రేటర్లు, ఆలయ ఉద్యోగులతో పాటు భక్తులు, ఆసక్తి కలిగినవారు కలిపి ఇప్పటికే 100 మందికి పైగా పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయాల నిర్వహణను మరింత పారదర్శకంగా, సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

