కలం, నిర్మల్: లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా రైతులంతా ఐక్యంగా ఉండి వాటిని కాపాడుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) అన్నారు. మంగళవారం బాసర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రైతుల సమస్యల విషయంలో పార్టీలు, రాజకీయ భేదాలు పక్కనపెట్టి సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
సాగునీటి సౌకర్యాల కల్పనపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని, అభివృద్ధికి ఎవరూ ఆటంకం కల్పించవద్దని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు గడ్డెన్న, నారాయణరావు పటేల్ హయాంలో కూడా రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరయ్యాయని గుర్తుచేశారు. కొన్నేండ్లుగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రితోపాటు అసెంబ్లీలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించి నిధులు మంజూరు చేయించానని తెలిపారు.

