కలం, వెబ్డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇటీవల ఓ మూవీ షూటింగ్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలసి సూచించారు. దీనిపై రష్మిక తొలిసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన పరిస్థితిపై ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు ఇది మూడో గాయమని, మైసా సినిమా డ్యాన్స్ షూటింగ్ సమయంలో తన కుడి తుంటి భాగంలోని కండరానికి తీవ్ర గాయమైందని తెలిపారు. అది తిరిగి అతుక్కునేందుకు కొంత సమయం పడుతుందని ఆమె వివరించారు. వరుస షూటింగులతో బిజీగా ఉన్న రష్మిక తన శరీరాన్ని ఒక మెషీన్లా కాకుండా సరిగ్గా చూసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్రేక్ను తాను ఒక హాలిడేలా భావిస్తున్నానని సరదాగా రాసుకొచ్చారు.
గాయం కారణంగా తాను ప్రస్తుతం వర్కవుట్లు, రన్నింగ్ వంటివి చేయలేకపోతున్నానని రష్మిక తెలిపారు. దీని వల్ల తాను బరువు పెరుగుతాననే ఆందోళన ఉందన్నారు. ఒకవేళ వర్కవుట్లు చేయకపోతే తాను కేవలం తింటూ డెజర్ట్ మోన్స్టర్లా మారిపోతానని తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే రకరకాల పజిల్స్ చేస్తూ సమయం గడుపుతున్నానని, త్వరలోనే మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తానని తన అభిమానులకు చెప్పారు. ఈ పోస్టులో రష్మిక తన తాజా ఫోటోతో పాటు కొన్ని స్వీట్లు, తన ఎక్స్రే రిపోర్ట్, కొన్ని పజిల్స్ షేర్ చేసుకున్నారు.

