కలం, వెబ్డెస్క్: గుజరాత్ (Gujarat)లో చండీపురా పేరుతో కొత్త వైరస్ (Chandipura Virus) తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 22 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 184 మంది బాధితులు ఈ వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో ఇప్పటికే 35 మందికి వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఏడుగురికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శాండ్ ఫ్లై అనే ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసులు వెలుగుచూస్తుండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచారు. మట్టి ఇళ్లలోని పగుళ్లను పూడ్చడం, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వంటి ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రజలకు సూచించారు.
ఈ వ్యాధికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేదా యాంటీవైరస్ మందు అందుబాటులో లేదు. అయినప్పటికీ, లక్షణాలు కనిపించిన వెంటనే పిల్లలను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని వైద్యులు తెలిపారు. గాంధీ నగర్, హిమ్మత్నగర్, పటాన్, రాజ్కోట్, భావ్నగర్ ఆసుపత్రులలో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండి, తక్షణ వైద్య సహాయం తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది.

