కలం, వెబ్ డెస్క్ : బిహార్ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో సరికొత్త సమీకరణాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రౌండ్ నుండి తన హవా కొనసాగిస్తున్న జేఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు, అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. మొత్తం 31 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు గానూ, 12వ రౌండ్ ముగిసే సమయానికి ప్రశాంత్ కిశోర్ స్పష్టమైన ముందంజలో నిలిచారు.
తాజా రౌండ్ ముగిసే సరికి జన్సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్కు 23,756 ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 17,110 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. దీనితో ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం 6,646 ఓట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుంచి 12వ రౌండ్ వరకు వరుసగా లీడ్ను కాపాడుకుంటూ వస్తున్న ప్రశాంత్ కిశోర్ క్రమంగా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తుండటంతో జన్సురాజ్ పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో జన్సురాజ్ అభ్యర్థి ముందంజలో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

