కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్ (Shikha Goel)ను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ వేదికగా కొందరు వ్యక్తులు అభ్యంతరకరమైన, దూషణలతో కూడిన పోస్టులు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఒక బాధ్యతాయుతమైన ఉన్నత మహిళా పోలీస్ అధికారిపై సోషల్ మీడియాలో ఈ స్థాయి నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు.
ఈ వివాదాస్పద పోస్ట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు, ఈ వ్యవహారం వెనుక ఉన్న మూలాలను అన్వేషించేందుకు బ్యూరో అధికారులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

