మీరాబాయి హ్యాట్రిక్ గోల్డ్.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 8 పతకాలు

కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games) లో భారత్ వెయిట్‌లిఫ్టర్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఎనిమిది పతకాలు సాధించి విజయవంతమైన ప్రచారాన్ని ముగించారు. ఢిల్లీకి చేరుకున్న భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా మీరాబాయి చాను (Mirabai Chanu) తన మూడో వరుస కామన్వెల్త్ స్వర్ణాన్ని గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను.. కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2014లో రజతం గెలిచిన ఆమె.. ఆ తర్వాత మూడు ఎడిషన్లలో వరుసగా స్వర్ణాలు అందుకున్నారు. మొత్తంగా నాలుగు కామన్వెల్త్ పతకాలు సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. భారత్‌కు పతకం అందించడం, మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణిగా దేశానికి గర్వకారణం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.

జట్టు ప్రదర్శనపై ఇండియా వెయిట్‌లిప్టింగ్ హెడ్ కోచ్ విజయ్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. వెయిట్‌లిఫ్టింగ్ జట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడారు. వరుసగా నాలుగు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన మహిళా వెయిట్‌లిఫ్టర్ ప్రపంచంలోనే మీరాబాయి (Mirabai Chanu) ఒక్కరేనని తెలిపారు. ఆమె క్రమశిక్షణ, అంకితభావమే ఈ విజయాలకు కారణమని అన్నారు. ఇకపై ఆసియా క్రీడలపైనే పూర్తి దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

మహిళల 53 కేజీల్లో రజతం గెలిచిన జ్ఞానేశ్వరి యాదవ్.. పతకం సాధించడం సంతోషంగా ఉందని, స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పురుషుల 60 కేజీల్లో రజత విజేత రిషికాంత్ సింగ్.. ఈ విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, భవిష్యత్ టోర్నీల్లో ఇంకా మెరుగ్గా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పురుషుల 110 కేజీల విభాగంలో రజతం సాధించిన లవ్‌ప్రీత్ సింగ్.. వచ్చే నెల జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పతకం గెలవడమే ఇప్పుడు తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మొత్తం ఎనిమిది పతకాలు గెలిచింది. ఇందులో ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. మహిళల 48 కేజీల్లో మీరాబాయి చాను స్వర్ణం సాధించారు. మహిళల 53 కేజీల్లో జ్ఞానేశ్వరి యాదవ్, 69 కేజీల్లో హర్జిందర్ కౌర్ రజతాలు గెలిచారు. పురుషుల 60 కేజీల్లో రిషికాంత్ సింగ్, 65 కేజీల్లో ముత్తుపాండి రాజా, 79 కేజీల్లో వల్లూరి అజయ్ బాబు, 110 కేజీల్లో లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకాలు సాధించారు. మహిళల 58 కేజీల్లో బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని అందించారు.

Also Read : వాస్తాపూర్ వాటర్‌ఫాల్స్‌ని చూసోద్దాం రండి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>