కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం గెలిచాడు. కానీ ఆ విజయాన్ని తన పేరుతో మాత్రమే ముడిపెట్టలేదు. చిన్నప్పటి నుంచి తన వెన్నంటే నిలిచిన భారత స్టార్ బాక్సర్ సరీతా దేవికే ఆ ఘనతలో పెద్ద భాగముందని జదుమణి సింగ్ (Jadumani Singh) చెప్పాడు.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 55 కేజీల విభాగంలో జదుమణి సింగ్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓడిపోయినా, టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేశాడు. పోటీ అనంతరం మాట్లాడిన జదుమణి… తన బాక్సింగ్ ప్రయాణాన్ని మలిచింది సరీతా దేవేనని చెప్పాడు. చిన్నప్పటి నుంచే ఆమె తనకు అండగా నిలిచిందని తెలిపాడు. ఆహారం ఎలా ఉండాలి, శిక్షణ ఎలా తీసుకోవాలి, క్రీడాకారుడిగా ఎలా ఎదగాలి… ప్రతి విషయంలో ఆమె మార్గనిర్దేశం చేసిందని వివరించాడు.
ప్రతిరోజూ తనతో మాట్లాడేదని, తరచూ వీడియో కాల్ చేసి సూచనలు ఇచ్చేదని వెల్లడించాడు. మంచి బాక్సర్గా మారాలంటే ఎలా ఆలోచించాలో కూడా ఆమెనే నేర్పిందని చెప్పాడు. కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ఆమె మద్దతు మరింత పెరిగిందని జదుమణి తెలిపాడు. ప్రతి మ్యాచ్ను చూసి లోపాలను చెప్పేదని వివరించాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదో సూచించేదని చెప్పాడు. తాను స్వర్ణ పతకంతోనే తిరిగి వస్తానని సరీతా దేవి ఎప్పుడూ ధైర్యం చెప్పేదని వెల్లడించాడు.
ఆ నమ్మకమే తనకు ఎంతో బలం ఇచ్చిందని పేర్కొన్నాడు. సరీతా దేవి భారత బాక్సింగ్లో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణుల్లో ఒకరు. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం, రెండు కాంస్యాలు, ఆసియా క్రీడల్లో కాంస్యం, కామన్వెల్త్ గేమ్స్లో రజతం, ఆసియా చాంపియన్షిప్లో ఐదు స్వర్ణాలతో పాటు ఎన్నో పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఫైనల్లో స్వర్ణం చేజారినా, రజత పతకం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని జదుమణి చెప్పాడు.
స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగానని, ఈ ఫలితం ఇకపై మరింత కష్టపడేలా ప్రేరేపిస్తుందని తెలిపాడు. ఆసియా క్రీడలు, ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో మెరుగైన ఫలితాలే ఇప్పుడు తన లక్ష్యమని వెల్లడించాడు. జదుమణి గ్లాస్గో ప్రయాణం కూడా గుర్తుండిపోయేలా సాగింది. తొలి పోరులో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కలెన్ను ఓడించాడు. తర్వాత పాకిస్థాన్కు చెందిన సుమామా రెహ్మాన్పై విజయం సాధించాడు.
క్వార్టర్ ఫైనల్లో జాంబియాకు చెందిన మ్వెంగో మ్వాలేను, సెమీఫైనల్లో నమీబియాకు చెందిన ఫిలిప్ హౌసెబ్ను ఓడించి ఫైనల్ చేరాడు. స్వర్ణ పతక పోరులో తొలి నుంచే గట్టిగా పోరాడాడు. కానీ ఆస్ట్రేలియా బాక్సర్ జై డిక్సన్ కచ్చితమైన కౌంటర్ పంచ్లతో పైచేయి సాధించాడు. చివరి గంట మోగే వరకు జదుమణి పోరాడినా, రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

