కలం, స్పోర్ట్స్ : తైపీ ఓపెన్ (Taipei Open 2026) బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళా షట్లర్లు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఉన్నతి హుడా, తన్వి శర్మ అద్భుత విజయాలతో సెమీఫైనల్కు చేరుకున్నారు. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఇద్దరూ ప్రత్యర్థులను ఓడించి పతక ఆశలను సజీవంగా ఉంచారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన ఉన్నతి హుడా, దేవికా సిహాగ్ తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 18 ఏళ్ల ఉన్నతి అద్భుత పోరాట పటిమను ప్రదర్శించి విజయం సాధించింది. తొలి గేమ్లో ఉన్నతి 11-3 ఆధిక్యంతో దూసుకెళ్లింది. అయితే దేవికా పుంజుకుని స్కోరును 21-21తో సమం చేసింది. ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఆడిన ఉన్నతి వరుసగా రెండు పాయింట్లు సాధించి 23-21తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్లోనూ ఉన్నతి ఆధిపత్యం కొనసాగించింది. మూడో సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమె, దేవికాపై 21-16తో గెలిచి 42 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించింది. స్ట్రెయిట్ గేమ్ల విజయంతో సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత షట్లర్ తన్వి శర్మ థాయ్లాండ్కు చెందిన సుపనిదా కాటెథాంగ్తో పోటీపడింది. దాదాపు 54 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో తన్వి 21-15, 18-21, 21-14 తేడాతో విజయం సాధించింది. మూడు గేమ్ల పోరులో పట్టుదలగా ఆడి సెమీస్కు చేరుకుంది.
ఇక పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ కిరణ్ జార్జ్కు నిరాశ ఎదురైంది. జపాన్కు చెందిన నాలుగో సీడ్ యుడాయ్ ఒకికోమోటో చేతిలో 21-12, 21-10 తేడాతో ఓటమి పాలయ్యాడు. మహిళల విభాగంలో ఉన్నతి హుడా, తన్వి శర్మ విజయాలతో తైపీ ఓపెన్లో భారత్ ఆశలు మరింత పెరిగాయి. సెమీఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించి పతకాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

