కలం, వెబ్డెస్క్: లోక్సభలో రెండో రోజు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనలపై దాడుల వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుబట్టారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని రాహుల్ వెల్లడించారు. యువత ఆందోళనలను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. పలువురు బీజేపీ నేతల పిల్లలు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ఆందోళనలను సమర్థించారని తెలిపారు.
అయితే కేంద్రం మాత్రం విద్యార్థుల బాధను అర్థం చేసుకోలేదని విమర్శించారు. పేపర్ లీక్ జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు కేంద్రం మూర్ఖంగా వ్యవహరించిందన్నారు. దేశంలో విద్య ఖరైదనిగా మారిపోయిందని, పేదలు విద్యకు దూరమవుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థలను నడుపుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ఆర్ఎస్ఎస్ ను ఎదురించే ధైర్యం ఉందని అన్నారు. విద్యార్థుల ఆందోళనలకు అమిత్ షా వణికిపోయారని విమర్రశించారు. అమిత్ షా పార్లమెంట్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సభకు వచ్చి తమ ప్రశ్నలను ఎదుర్కునే ధైర్యం లేకనే హోం మంత్రి రాలేదంటూ ఎద్దేవా చేశారు
ఈ సందర్భంగా రాహుల్ (Rahul Gandhi) తాను ఓ విద్యార్థినితో మాట్లాడిన సంభాషణను సభలో ప్రస్తావించారు. సదరు విద్యార్థిని నిరసనల సమయంలో ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారని చెప్పారన్నారు. ఒకరు చెప్తే వినేవారు, మరొకరు ఎంత చెప్పినా వినని ఇడియట్స్ అని అన్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ సభలో చేసిన ఈ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ విద్యార్థులను అడ్డుపెట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ సభలో ఇడియట్స్ అనే పదం వాడటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తన భాష మార్చుకోవాలని రాహుల్కు సూచించారు. కొద్ది సేపు ఈ వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ ఎంపీల ఆందోళనతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
Read Also: జెన్ జీ.. వయా ఇన్స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On: Instagram

