కలం, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన వయస్సు 79 సంవత్సరాలని.. అప్పటికి 81–82 ఏళ్లు వస్తాయని.. ఆరోగ్య రీత్యా ఉత్సాహంగా పనిచేయడం సాధ్యం కాదని వివరించారు. అందుకే, ఇక నుంచి ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ, ప్రజా సేవలోనే కొనసాగుతానని మాత్రం స్పష్టం చేశారు.
అవినీతిమయంగా రాజకీయాలు..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి తనను పోటీ చేయాలని కోరుతున్నారని సిద్ధరామయ్య వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలే డబ్బులు సమకూర్చి తనను గెలిపిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు అవినీతిమయంగా మారిపోయాయని.. డబ్బులు లేకుంటే గెలిచే పరిస్థితి లేదన్నారు. నిజాయతీ రాజకీయాలకు చోటు లేనందునే.. పోటీ చేయొద్దని బలంగా నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
సిద్ధాంతాలకు కట్టుబడి..
2028 ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని సిద్ధరామయ్య వెల్లడించారు. 1978లో తాలుకా బోర్డు సభ్యుడిగా మొదలై.. సీఎం స్థాయి వరకు చేరినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో విజయాలు, ఓటమలు చూశానని.. కానీ, నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లలేదని స్పష్టం చేశారు. మనస్సాక్షి ప్రకారమే నడుచుకున్నానని సిద్ధరామయ్య (Siddaramaiah) వివరించారు. తనకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని.. వారి సేవకే అంకితం అవుతానని తెలిపారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే.. ప్రజల కోసం మరింత బాగా పనిచేస్తానని చెప్పారు.
Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. బీజేపీ ఎంపీ కూతురు సంబరాలు
Follow Us On : WhatsApp

