కలం, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట (Ramannapeta)లో భారీగా కల్తీ అల్లం పేస్ట్ ను ఎస్ఐ సతీష్ పట్టుకున్నారు. రామన్నపేట సెంటర్లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్ను ఆపి తనిఖీ చేశారు. అందులో భారీ ఎత్తున కల్తీ అల్లం పేస్ట్ డబ్బాలు బయటపడటంతో అల్లం పేస్ట్ తయారీ గురించి డ్రైవర్ వద్ద నుండి ఎస్ఐ సతీష్ కూపి లాగారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
డ్రైవర్ ఇచ్చిన సమాచారాన్ని కీసర (Keesara) పోలీసులకు అందజేయగా కీసరలోని ప్రధాన తయారీ యూనిట్పై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించి భారీగా ముడి పదార్థాలు, యంత్రాలు, తయారైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని, ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా ఆడుకుంటే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also: మిర్యాలగూడలో 24 గంటల తాగునీరే లక్ష్యం : ఎమ్మెల్యే బీఎల్ఆర్
Follow Us On: Sharechat

