కలం, కరీంనగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
విలీన గ్రామాల్లోనూ..
కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి–ఎలగందుల, బొమ్మకల్, విద్యారణ్యపురి, అలుగునూరు, చింతకుంట ప్రాంతాలతో పాటు ఇటీవల విలీనమైన గ్రామాల్లో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు, గంగాధర, గన్నేరువరం మండలాల్లో నీటి అవసరాలు, వినియోగం, సరఫరా పరిస్థితులను సమీక్షించారు.
రిజర్వాయర్లో తాగు నీటి నిల్వలపై..
ఎల్ఎండీ రిజర్వాయర్లో నీటి నిల్వలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. డెడ్ స్టోరేజ్ పరిస్థితి ఏర్పడకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గన్నేరువరం మండలం హనుమాజిపల్లి–జంగంపల్లి ప్రాంతాల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.
గంగాధర మండలం నారాయణపూర్ చెరువు నీటిని గంగాధర, చొప్పదండి మండలాల తాగునీటి అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
ఓవర్హెడ్ ట్యాంకుల శుభ్రం..
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఓవర్హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. పైపులైన్ లీకేజీలు, నిర్వహణ లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో నీటి పొదుపుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈలు రామ్కుమార్, సందీప్కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్రావు పాల్గొన్నారు.

