నీట్ పేపర్ లీక్ ఆందోళనలు.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా!

క‌లం, వెబ్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నీట్ పేప‌ర్ లీక్ (NEET Paper Leak) వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ప‌ద‌వికి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చాయి. పేపర్ లీకుల‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఆందోళ‌న‌లు, కేంద్ర ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

తన పదవికి రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నామని.. అందుకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని అన్నారు.  ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపించారు.

కాక్రోచ్ పార్టీదే ప్ర‌ధాన పాత్ర‌

ధ‌ర్మేంద్ర (Dharmendra Pradhan) రాజీనామాకు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆందోళ‌న‌లే ముఖ్య కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. నీట్ స‌హా ప‌లు జాతీయ‌ పరీక్షల నిర్వ‌హ‌ణ‌లో పారదర్శకత లోపించిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింద‌ని యువత నెల‌ల త‌ర‌బ‌డి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వ‌హిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వ‌ర్యంలో యువజన సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ నిర‌స‌న‌లు కేవ‌లం ఢిల్లీకే ప‌రిమితం కాకుండా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు విస్త‌రించాయి.

అటు పార్లమెంట్ లోపల, బయట విపక్షాలు సైతం ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై దాడి చేశాయి. మరోవైపు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల మొద‌టి రోజే కాక్రోచ్ పార్టీ పార్ల‌మెంట్ ముట్ట‌డికి పిలుపునిచ్చింది. ఈ నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంటు ముట్టడి కి యత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ రిలీజ్ చేయడం వంటి పరిణామాలు మరింత ఉద్రిక్తలను రేకెత్తించింది. ఈ క్రమంలో జులై 20న జేపీ నడ్డా, సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. శుక్రవారం మరోసారి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధులతో భేటీ కాగా… ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఒక్కరోజు డెడ్ లైన్ విధించింది. అటు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. యువ‌త నుంచి వ‌స్తున్న తీవ్ర‌ వ్యతిరేకత, రాజకీయ ఒత్తిళ్ల నేప‌థ్యంలో సుధీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Read Also: ఇక అసలైన మజా వస్తుంది: సౌరవ్ దాస్ సంచలన వ్యాఖ్యలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>