కలం, వెబ్డెస్క్: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము జాతులలో ఒకటైన కింగ్ కోబ్రా (King Cobra) సంరక్షణలో ఏపీ అటవీ అధికారులు (AP Forest Officials) , వన్యప్రాణి సంరక్షకులు సక్సెస్ అయ్యారు. అనకాపల్లి జిల్లాలోని శంకరం రిజర్వాయర్ ఫారెస్ట్లోకి 24 కింగ్ కోబ్రా పిల్లను వదిలిపెట్టారు. వన్యప్రాణుల సంరక్షణలో ఇది ఒక అరుదైన మైలురాయిగా అధికారులు పేర్కొన్నారు. దాదాపు 41 రోజులుగా నిరంతర పర్యవేక్షణ, రక్షణ చర్యల అనంతరం ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు.
కింగ్ కోబ్రా పిల్లలను వాటి సహజ సిద్ధమైన ఆవాసంలోకి తిరిగి వదిలే ముందు, అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు వీటికి 24 గంటల పాటు కంటికి రెప్పలా రక్షణ కల్పించారు. భారతదేశంలో కేవలం కొన్ని అటవీ ప్రాంతాలలో మాత్రమే కింగ్ కోబ్రాలు సహజంగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలోని తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ జాతిని రక్షించడానికి, తూర్పు కనుమల ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు.

